9, మే 2014, శుక్రవారం

తడబాటా? / తొందరపాటా?

                                  తడబాటా? /  తొందరపాటా? 
 ఇది 1975 జనవరి  లో జరిగింది.  ఏమిటా  అని ఆలోచిస్తున్నారా?  ఆలోచించకండి. చెబుతాను...... యదార్ధ  సంఘటన  యధాతధంగా ......

         చిన్నప్పుడంతా  సెలవలకి  అమ్మమ్మా  వాళ్ల  ఇంటికో,  పెద్దమ్మ  గారింటికో,  అత్తయ్యగారింటికో  వెళ్ళడం  అలవాటు.  అప్పుడు  హోటల్ లో దిగడం  అవసరం లేదు,  అలవాటు లేదు.  ( మా  చిన్నప్పుడు  హోటల్ కి  వెళ్లి  తింటే  కూడా  వింతే  జనాలకి.  పెద్దగా పిల్లలూ,  ఆడవారు  వెళ్ళిన దాఖలాలు  లేవు.)  
    అలాంటి  వాతావరణం లో  పెరిగిన  నాకు, పెళ్లి అయ్యాక  మొదటిసారి  తిరువయ్యర్  వెళ్లి,  (తమిళ్ నాడు గవర్నమెంట్  గెస్ట్  హౌస్ లో దిగేము.)  అక్కడ నుండి  మద్రాస్  వెళ్లి   మైలాపూర్లో  హోటల్ లో దిగేము.  ఎందుకయినా  మంచిదని  ఒక తాళం  కప్ప  పట్టుకొమ్మన్నారు  మావారు. ( అన్నట్లు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ....... ఆయనకు అప్పటికే  కచేరీల  నిమిత్తం  వేరే ఊర్లకి  వెళ్ళడం , హోటల్ లో దిగడం  అలవాటు ఉన్ది)
 

.  

      ఏమిటి  ఈ సోది  అసలు విషయం ఎప్పటికీ. చెప్పరేమిటి? అని చదవడం  ఆపేయకండి,  అసలయిన విషయమ మొదలవుతోంది. మరి సంఘటన  కళ్ళకు కట్టినట్లుఉండద్దూ......సరే  ముందుకు వెళ్దాం.....

    స్నానపానాదులన్నీ  అయి  మధ్యాహ్నం  భోజనం అయ్యాక, మేము బయటకి వెళ్లేము.  వెళ్లేముందు  మాఆయన  గదికి  హోటల్ వాళ్ళిచ్చిన  తాళం కప్పవేసి, కౌంటర్ లో  తాళం  చెవి ఇవ్వడం చూసి , ఏమిటిది తాళం  వాళ్లకిస్తే , వాళ్లు  మన  వస్తువులు అన్నీ  కాజేస్తారు కదా  అనుకుని (అమాయకత అక్కడేమున్నాయని, ప్రయాణంలో నలిగి పోయిన  బట్టలు తప్ప.... వెధవ జాగ్రత్త) మావారికి చెప్పకుండా  పరుగెత్తుకుంటూ  వెనక్కి  వచ్చి  నా హాండ్బాగ్లో ఉన్న తాళం, మావారు వేసిన తాళం  మీద  డుబుల్ తాళం  వేసేను. 

   అయ్యిందా ........రాత్రి 10 కి  హోటల్ కి వచ్చాం. నేను లోపలి  వచ్చేసి మళ్లీ  మా వారికి తెలియకుండా  గబగబా నేను వేసిన తాళం తీసేసి, ఎరగనట్లు నుంచున్నా.  నా చేతిలో  తాళం  కప్ప ఇంకా లోపల దాచలేదు.  ఇంతలో ఆయన నవ్వుకుంటూ  వచ్చి, కౌంటర్ లో ఎవరో వాళ్ళ రూం  లాక్  చేసేరని  గొడవపెడుతున్నారంటూ, నా వైపు చూసి  విషయం గ్రహించేరు. బహుసా మీరూ గ్రహించే ఉంటారు.....

       ఎప్పుడూ హోటల్ సంస్కృతి  తెలియక పోడంవల్ల, రూమ్ లన్నీ  పెయింట్లు  ఒకేలా ఉన్నా, నెంబర్లు  వేరేగా  ఉంటాయని తెలీని  అమాయకత. వెనక్కి  తాళం  వెయ్యడానికి వెళ్లినప్పుడు, మా రూం కి తిన్నగా వెళ్లకుండా....... వాలుగా పక్క రూం కి  వెళ్లి తాళం  వేసేను.  దానికి వచ్చిన  తిప్పలిదంతా........

  మాకు ఇప్పటికీ చాల నవ్వు వస్తుంది  ఆ సంఘటన  తలచుకుంటే ,  మరి మీకో?   నవ్వ లేక  నవ్వ  లేక  నవ్వతున్నారా?  ఫరవాలేదులెండి...నవ్వి పెట్టండి కొంచెం. పాపం  ఆనందిస్తాము....




9, జనవరి 2011, ఆదివారం

సాహిత్యం:- వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

పల్లవి..... వినరాద నా మనవి


చరణం  1:- కనకాంగ  కావేటి రంగ పతే
                కాంత కాంత లెల్ల కామించి పిలచితే ...వినరాద  నా మనవి


చరణం ౨:- భాగదేయ వైభోగ రంగపతే
               త్యాగరాజ నుత తరుణులు పిలచితే.......వినరాద నా మనవి

8, జనవరి 2011, శనివారం

వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

        ఒక సారి త్యాగరాజ స్వామి చైత్రోత్సవము చూడడానికి శ్రీరంగం వెళ్ళి,ఆ సమయం లో బంగారపు రధం  మీద ఊరేగింపుగా వస్తున్న దేముడిని చూచి ఆనంద పారవశ్యం తో "రాజు వెడలె చూతము రారే ' అను కృతి తోడి రాగం లో పాడేరట. 
    పదహారు మంది బోయీలతో ఊరేగుతున్న ఆ రధం త్యాగరాజ స్వామి  ఉన్న ఇంటి ముందుకు వచ్చింది, కుతూహలముతో త్యాగరాజ స్వామి ఆ వైభోగ రంగని దర్శించు కున్దామనుక్కున్నారు    . కానీ ఆ జన సమూహం లో దర్శించుకునే అవకాశం దొరకక, నిరుత్సాహ  పడి అక్కడే నిల్చుండి  పోయి చూస్తున్నారట. ఇంతలో ముందుకు సాగిన రధం కదల కుండా ఉంది పోయిందట, బోయీల కాళ్ళు బరువులేక్కి   ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి, ద్రుష్టి దోషం తగిలిందని భావించి తరుణోపాయలు వెతుకుతున్నారట.ఇంతలో దేవాలయం అర్చకులలో ఒకరు దేవప్రేరితులై త్యాగరాజ స్వామిని చూపి" ఆ మహా భక్తుని రధం వద్దకు తీసుకు రమ్మని" చెప్పినారట. అంతట త్యాగరాజ స్వామి సంభ్రమ ఆశ్చర్యాలతో దేవుని రధం వద్దకు పోయి ప్రఖ్యాత కృతి "వినరాద నా మనవి" అను కృతి ఆలపించారట.


అనుపల్లవి లో "కాంత కాంత లెల్ల కామించి పిలచితే" అనినారు, అంటే  దేవ దాసీలు నృత్యము చేసి పిలచితే పొరాదా అని రంగానాధుని  ప్రస్నించినారు. ఈ కృతి పాడుట పూర్తి చేసి దీపారాధన పూర్తి అయ్యేసరికి, ఆశ్చర్య దాయకముగా రధము కదలినదట.


తరువాత ఒక రోజు త్యాగరాజ స్వామి దేవాలయమునకు ఆహ్వానింప బడ్డారట. ఆ రోజు మూల విరాట్టు అద్భుతం గా అలంకరింప బడి ఉన్నదట .భగవంతుని జూచి భక్తి తో  ఈశ్వర ప్రేరితులై "ఓ రంగశాయి " అను కాంభోజి కృతి రచించినారట. 


 చిరంజీవి సౌభాగ్యవతి  కల్యాణి  కోరిక మేరకు ఈ కృతి ఏ సందర్భం లో త్యాగరాజ స్వామి రచించారనేది నాకు తెలిసిన విధం గా రాస్తున్నాను. 

7, జనవరి 2011, శుక్రవారం

"రాగము" భావ వ్యక్తీకరణ సాధనము

"రాగము" భావ వ్యక్తీకరణ సాధనము అను మాట చూడగానే మనకు నిజం అనిపిస్తుంది కదా.
 మానవుడు ముందుగా బుద్ది తెలిసిన తరువాత, ప్రకృతిని చూసి తనివి తీరా పాడుకుని, నృత్యము చేసి కొని ఉంటాడు.. తన భావములను పాటలోనే వ్యక్తము చేసికొని ఉంది ఉంటాడు తప్పక..


   అనంత మయిన రాగములు నవరసముల లో ఏదో ఒక రసమును   కలిగి ఉంటాయి. ఒక్కక్క భావాన్నీ వ్యక్తీకరించడానికి దానికి సరి  అయిన  రాగాన్ని ఎంచుకోవాలి. అలా చేస్తేనే మన భావాన్ని సంపూర్ణం గా తెలియ జేయగలము. 
ఉదా:- రౌద్రమునకు "అటాణా" 
విచారానికి  "ముఖారి" ,"జిన్గ్లా".


త్యాగరాజు మొదలగు వాగ్గేయ కారులు,  భావానుగుణ్యమయిన   రాగములలో రచించడం వల్లనే  రచనలన్నీ  రంజకముగా ఉండి, బాగా వాడుకలోకి వచ్చాయి .


ఉదా:- త్యాగరాజ స్వామి,  శ్రీరాముని చూసిన ఆనందములో బిలహరి లో "కనుగొంటినీ శ్రీరాముని" అను కృతి వ్రాయడం  చాల సందర్భోచితం గా ఉంది. కారణం ఆనంద కరమయిన  బిలహరి రాగం  లో రచించడమే అందుకు కారణం, అలా కాకుండా విచారం వ్యక్తం చేసే ఏ రంజని లోనో, లేక జినగ్ల లోనో రచించి ఉంటె బాగుండేది కాదు.


అందువల్లనే మన వాగ్గేయ కారులందరూ, రాగం యోక్క భావాన్ని తెలిసుకుని,వారి రచనలను భావాను  గుణ్యముగా రచించారు.


రాగానికి   భావమెట్లు  తోడ్పడుతుందో,, భావానికి రాగమట్లు తోడ్పడుతుంది..




  

6, జనవరి 2011, గురువారం

కౌముది

విశ్రాంతి  దొరికింది.  ఏమిచేద్దామబ్బా..............? 


కొంచెం సేపు హాయిగా నిద్ర పోతే?

కాదు కాదు టివి న్యూస్  చానల్స్  చూసుకుంటే ?
( అవే కదా మా entertainment చానల్స్, పంది పిల్ల గుడి చుట్టూ తిరిగినా, మాకు గొప్ప  న్యూస్ కదా  మరి.  ఇందులో ఇందులో బాగా  అరచుకుంటూ సంభాషించే రాజకీయ నాయకుల చర్చలూ,   అక్కడా  ఇక్కడా హత్యలూ దొంగతనాలూ జరిగాయనే వార్తలూ,  ఒకటేమిటి మాకు నిత్యం విపరీతమయిన సందడీ, సరదా.  చివరికి ఎలా తయరయ్యమంటే ఏమీ క్రయిం  లేక పోతే ఆ రోజు ఏమీ తోచనంత )

అబ్బో టైం వేస్ట్. చక్కగా వీణ వాయించుకుంటే?

 కొంచెం సేపు మెయిల్స్ చూసుకుని... వెంటనే అయిదు నిమిషాల్లో వీణ వాయించుకుంటా, నిజం ముమ్మాటికీ నిజం..

ఇక ఇంటర్నెట్ లోకి వెళ్లి  మెయిల్స్ చూసాక , యు ట్యూబ్ లో సంగీతం విని,చూసుకుని, అయ్యో మంచి బుక్ చదువుకుంటే  అనిపించి వెంటనే కౌముది చదువుకుంటుంటే , టైం తెలీడం లేదు. ఇంతలో పని వేళ అయిపొయింది. 


  వీణ వాయిన్చుకోలేదని బాధ గా ఉంది. రేపు తప్పక వాయించుకుంటాను.
 వీణ వాయిన్చుకోలేదని అసంతృప్తి గా ఉన్నా,  కౌముది చదివినందుకు  అంతులేని త్రుప్తి.


 అద్భుతమయిన మాగజైన్ కౌముది.

పుస్తకప్రియులందరూ ఇంటర్నెట్ లో కౌముది తెలుగు మాగజైన్ చదవండి తప్పక. అన్నీ ఆణిముత్యాలే.


31, అక్టోబర్ 2009, శనివారం

జీవిత సత్యాల వివరణ (నాకు తెలిసినంతలో)

సంతోషం లో వాగ్దానం చెయ్యకు...............


మనకు తెలిసిన చక్కటి ఉదాహరణ దశరధుడు ఒకానొక ఆనంద కరమైన పరిస్థితుల్లో కైకేయికి వాగ్దానం చేయడం.


పసి బాలులయిన రామ లక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణార్ధం అడవికి వెళ్ళడం,సీతాదేవి తో వివాహం, రామునికి వనవాసం, సీతావియోగం, రామ..రావణ యుద్ధం, పట్టాభిషేకం, సీతాదేవి వనవాసం, రామునికి లవకుశుల బాల్యం ఆనందించడానికి వీలులేకుండాపర్ణశాల లో వారి బాల్యం, చివరికి సీతాదేవి అవని లోఇక్యమవ్వడం (అన్నీ కష్టాలే) ఇవన్నీ సంతోషం లో చేసిన వాగ్దానమే కదా కారణం.
(దానివల్లనే మన అందరికీ అద్భుతమైన రామాయాణాన్నీ , మనందరమూ ఆదర్శం గా తీసుకునే విధం గా రాముని వ్యక్తిత్వం తెలియజేయడం జరిగింది, ఇది పాజిటివ్ థింకింగ్ ......నిజం కూడా ) .
ఆనందానికి అవధులు కానీ, ఆలోచన కానీ లేదు.


అలాగే కోపం లో సమధానం వల్ల చాలా అనర్ధాలు వస్తాయి.............
కోపం సమయం కొద్ది సేపే, కానీ దాని వల్ల జరిగే (ఆ సమయం లో అనే మాటలూ, చర్యలవల్ల) హాని అంతా ఇంతాకాదు.
మాట ఒక్క క్షణం లో అనేస్తాము కానీ, అనిపించుకున్నవారు మాత్రం జీవిత కాలం గుర్తుంచుకుంటారు, అవకాశం వచ్చినప్పుడు దెప్పుతునె వుంటారు. ఎందుకు వచ్చిన తంటా, హాయిగా కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఒకటి నుండి వంద వరకూ నంబర్లు లెఖ్ఖ పెట్టుకుంటే , ఈ లోగా కోపం మటుమాయమవుతుంది. సమస్య ఉండదు. అందరమూ మానవ మాత్రులమే. ఏదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాము.
నా ఉద్దేశ్యం లో క్షమా గుణం , మరపు, కోపం సమయం లో మాట్లాడకుండా ఉండడం పరిష్కారం గా భావిస్తాను.
కానీ ఇది చాలా కష్టసాధ్యమయిన . ప్రయత్నిస్తే సఫలీక్రుతులమవ్వగలము.


ఇక మూడవది ఒత్తిడి లో నిర్ణయాలు తీసుకోవద్దు.................
ఈ విషయం ఈ మధ్య మాకు తెలిసిన వారి వద్ద ఈ ప్రస్తావన వచ్చినప్పుడు , ఆ అమ్మాయి అన్న మాట నన్ను ఒక నిమిషం ఆలోచింప జేస్తోంది.
ఏమంటే ,నిర్ణయాలు తీసుకునే అప్పుడే కదా ఒత్తిడి ఉండేది .
నిజమే, నిర్ణయం తీసుకునేప్పుడు ఒత్తిడి....ఒత్తిడి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. మరి ఎలా?
ఇది సహజం.
కాబట్టి హాయిగా ప్రశాంతం గా అయి, (ఇష్టమైన వ్యాపకం తో) అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అసలయిన, మనకి కావలసిన నిర్ణయం చేసుకోగలమని నా భావన.
ఏమయినా ఆనందం కానీ , కోపం గానీ, ఒత్తిడి కానీ అన్నీ తీవ్రమయిన భావాలే. ఆ సమయంలో వాటిని నియంత్రిచుకుని, మనని మనం కూడా నియంత్రించుకుని వ్యవహరిస్తే జీవితం హాయిగా నల్లేరు మీద బండిలా నడుస్తుందని నా భావన.

నాకు తెలిసినది రాసేను. మీ ఎవరైన కూడా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే వ్రాయండి.

14, సెప్టెంబర్ 2009, సోమవారం

వ్యక్తిత్వం

మంచి వ్యక్తిత్వం ఏర్పరచుకోడం అనేది ఒక వ్యక్తి కోసమో, లేక ఒక వ్యవస్థ కోసమో కాదు. అంటే తండ్రి పేరు నిలబెట్టడం కోసమో, లేక భార్య/భర్త కి మంచి పేరు తేడం కోసమో కానీ, లేక పుట్టినింటికి కానీ అత్తవారింటికి కానీ పేరు తేవడం కోసం కాదు. పుట్టిన ప్రతీ వ్యక్తీ చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోవలసిందే. ఇది నిజం. మీరూ ఒప్పుకుంటారు కదా!


వ్యక్తిత్వం అంటే ఏమిటి?


చక్కటి అలవాట్లూ, అభిరుచులూ, ఆశయాలూ, ఆచరణలూ. ఒప్పుకుంటారు కదా.


దీనితో బాటూ చక్కటి వేష ధారణ, చక్కటి ఉచ్చారణతో సంభాషించడం, (ఎదుటవారిని నొప్పించకుండా, ఆహ్లాద పరుస్తూ) చాల ముఖ్యం. ముఖ్యంగా ఎదుటివారు చెప్పింది విని, అప్పుడప్పుడు మన విషయాలు చెప్పే వారే , మంచి స్నేహితులవుతారు అనేది నిర్వివాదాంశం.


ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మంచివయ్యి వుండాలి. హితవయ్యింది, మితం గా సకాలం లో భుజించాలి.


ఎదుటివార్తో పంచుకోడానికే ఈ నీతులు. ఆచరణలో చాలా కష్టం. బహుసా కొన్ని ఆచరించ గలము.
ఏమయినా చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోడం కష్టం తో కూడిన ఇష్టం అందరికీ.